Monday, July 20, 2020

A telugu moral story about father and son.

"నాన్నా! రేపు మా తరగతిలో పిల్లలంతా పరీక్ష ఫీజు చెల్లించాలని హెడ్ మాస్టర్ చెప్పారు" 

ఇంట్లోకి అడుగు పెడుతూనే అన్నాడు రఘు. అప్పుడే కూలిపని ముగించుకుని ఇంటికి వచ్చిన కేశవులు కొడుకు మాటలు విని 'అలాగా! ఫీజు ఎంత ఏంటి? అని అడిగాడు.

రెండు వందలని మెల్లగా చెప్పాడు రఘు.
"అవునా! రెండు వందలా ఈసారి బాగా పెంచేశారు , సర్లే రేపు బడికి వెళ్లే టప్పుడు ఇస్తాను" అంటూ పెరట్లోకి నడిచాడు కేశవులు.
మరుసటి రోజు ఉదయం రఘు బడికి వెళ్లేందుకు తయారవుతుండగా 'ఇదిగోరా రెండువందలు, జాగ్రత్త మరి , వెళ్లినవెంటనే టీచర్ కి ఇవ్వు' అని జేబులో పెట్టాడు. సరే నాన్న అంటూ బయటకు నడిచాడు రఘు. రఘు కాస్త దూరం నడవగానే అతని స్నేహితుడు అమర్ ఎదురయ్యాడు.
ఏరా మీ నాన్న ఫీజు డబ్బులు ఇచ్చారా ? ఆతృతగా అడిగాడు అమర్.
ఇచ్చారురా మరి , మీ నాన్న ? అమర్ కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు రఘు.
నేను ఫీజు రెండువందల యాభై రూపాయలు అని చెప్తే మారు మాటాడకుండా ఇచ్చేసారరా మా నాన్న, గొప్పగా చెప్పాడు అమర్.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే వాళ్ళు చెల్లించవలసిన ఫీజు వంద రూపాయలే. తమ తల్లిదండ్రులనుంచి ఎక్కువ డబ్బు తీసుకుని వాటితో సినిమాకు వెళ్లాలని పథకం వేసుకున్నారు.ఇద్దరిది ఒకే తరగతి, ఒకే బెంచీలో కూర్చుంటారు, కలిసి తిరుగుతుంటారు. తల్లిదండ్రుల్ని నమ్మించి భలేగా డబ్బులు తీసుకున్నామని ఇద్దరూ మురిసిపోయారు. చెరో వంద వారి తరగతి ఉపాధ్యాయుడికి ఫీజు చెల్లించారు.
మరునాడు ఆదివారం కావడంతో ఇద్దరూ ఆడుకోవడానికి అని ఇంట్లో చెప్పి టౌనుకు బయలుదేరారు. సినిమా చూసి, ఆ తరువాత మిఠాయి దుకాణానికి వెళ్లి తమకు ఇష్టమైన తినుబండారాలు ఎన్నో కొనుక్కుని తిన్నారు. ఆనందంగా గడిపారు, చీకటిపడే వేళకు ఇంటికి చేరుకున్నారు. రఘు ఆట నుంచి ఇంటికి వస్తున్నట్టు నమ్మించేందుకు ఒక క్రికెట్ బాట్ చేతిలో పట్టుకుని నెమ్మదిగా ఇంట్లోకి అడుగుపెట్టాడు. అదే సమయంలో పక్క గదిలో తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్న మాటలు విని ఆగిపోయాడు.
కిటికీలోంచి లోపలకు చూసాడు, వాళ్ల నాన్న మంచం మీద జ్వరంతో వనికిపోతూ ఉన్నాడు. అతని భార్య సపర్యలు చేస్తూ " వచ్చిన డబ్బులన్ని పిల్లాడు ఫీజు కోసం ఇచ్చేశావ్, మందులు తెద్దామంటే ఇంట్లో రూపాయి కూడా లేదు" అంది.
అందుకు కేశవులు సమయానికి ఫీజు కట్టకపోతే రఘుని పరీక్షలకు అనుమతించరు. నాకు మాములు జ్వరమెగా వచ్చింది రేపటికి తగ్గిపోతుందిలే అన్నాడు మూలుగుతూ
అలా అంటే ఎలా నేను పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్లి, ఒక యాభై రూపాయలు అడిగి మందులు కొని తెస్తాను, అంటూ లేవబోయిన ప్రమీల చేయి పట్టుకుని ఆపి వద్దు రేపు చూద్దాంలే ఇప్పుడు అప్పు చేయడం ఎందుకు అన్నాడు కేశవులు.
అదంతా చూస్తున్న రఘుకు బాధగా అనిపించింది. తన విలాసాల కోసం ఖర్చు చేసిన వంద రూపాయలు ఎంత విలువైనవో తెలిసి వచ్చింది. అది కాక రోజు వారి కూలికి వెళ్లి సంపాదించే తన తండ్రి శ్రమ విలువని అర్థం చేసుకోలేకపోయానని బాధ పడ్డాడు. తన ఫీజుకోసం ఉన్న డబ్బులన్ని ఇచ్చిన తండ్రి మంచితనాన్ని తలుచుకోగానే దుఃఖం తన్నుకు వచ్చింది.
గదిలోకి పరుగున వెళ్లి తండ్రిని అమాంతం కౌగిలించుకున్నాడు. వెక్కి వెక్కి ఏడుస్తూ జరిగిన సంగతంతా చెప్పాడు. తప్పును క్షమించమని విలపించాడు. వాస్తవాన్ని చెప్పినందుకు రఘుని తల్లిదండ్రులు కోపగించుకోలేదు.
పైగా "చూడు రఘు! నువ్వే మా సర్వస్వం. నీకోసం, నీ చదువు కోసం ఏమైనా చేస్తాం. నువ్వు మాలా కూలి బ్రతుకు బ్రతకకూడదన్నదే మా కోరిక. జరిగింది మరిచిపో , ఇక మీద నీకేం కావాలన్న సంకోచం లేకుండా మమ్మల్ని అడుగు మేము తెచ్చిపెడతాం. మళ్ళీ ఇలాంటి పొరపాటు చేయకు, అంటూ అక్కున చేర్చుకున్నారు.
ఆ ఘటన రఘులో గొప్ప మార్పు తెచ్చింది. ఎప్పుడూ #మంచి_ప్రవర్తనతో మెలుగుతూ , తన మిత్రుడిలోనూ అలాంటి పరివర్తన తీసుకొచ్చాడు.

A successful story about post man awarded by Padmashri Award.

పద్మశ్రీకి అర్హుడే : 30ఏళ్లుగా దట్టమైన అడవిలో రోజూ 15 కి.మీ నడిచి వెళ్లి ఉత్తరాలు డెలివరీ చేసిన పోస్టుమ్యాన్

దట్టమైన అడవి.. అందులో క్రూర మృగాలు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియదు. ఇక మనిషి తప్పిపోయి ఒక్కసారి అడవిలోకి వెళితే వస్తాడో రాడో కూడా తెలియదు. అలాంటి అడవి గుండా 30 ఏళ్లుగా ఓ పోస్టుమ్యాన్‌ నడుచుకుంటూ వెళ్లి మారుమూల ప్రాంతాలకు ఉత్తరాలు అందించాడు. ఆ పోస్టుమ్యాన్ దట్టమైన అడవి ప్రాంతంలో 15 కిలోమీటర్లు నడుస్తూ అందరి మన్ననలను పొందాడు.

తమిళనాడుకు చెందిన పోస్ట్‌మాన్ డీ శివన్ పోస్టల్ శాఖలో పోస్టుమ్యాన్‌గా చేరినప్పటి నుంచి ఉద్యోగ విరమణ చెందేవరకు దాదాపు 30 ఏళ్ల పాటు దట్టమైన అడవి ప్రాంతంలో రోజూ ఏనుగులు, ఎలుగుబంట్లను దాటుకుంటూ జారే ప్రవాహాలు, జలపాతాలను అధిగమించి 15 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి ఉత్తరాలు, పెన్షన్ సొమ్ము పంచి వచ్చేవాడు. శివన్ ఎక్కువగా నీలగిరి పర్వతాలు, రైల్వే ట్రాక్‌ల వెంట నడుస్తూ వెళ్లి వచ్చేవాడు. కూనూర్ సమీపంలోని హిల్‌గ్రోవ్ పోస్ట్ ఆఫీస్ నుంచి ట్రెక్కింగ్ సమీప ప్రాంతాల్లో నివసించే తోటల కార్మికులకు ఉత్తరాలు, పెన్షన్లు పంపిణీ చేసేందుకు పోస్టుమ్యాన్ శివన్ వెళ్లాల్సి వచ్చేది. రిమోట్ ప్రాంతాల్లో పనిచేస్తుండడంతో సొరంగాలు, అటవీ ప్రాంతాల మీదుగా నడిచేవారు.
ఈ క్రమంలోనే తరచూ అడవి జంతువులను శివన్ ఎదుర్కొనేవాడు. కొన్ని సందర్భాల్లో అతడిని ఏనుగులు, ఎలుగుబంట్లు వెంబడించి తరిమిన సంఘటనలు ఉన్నాయి. ఆయన బెదరకుండా 30 ఏళ్లుగా అదే అడవి గుండా నడుచుకుంటూ వెళ్లీ తన విధులను నిర్వర్తించాడు.
ఇలా 30 ఏండ్ల పాటు తపాలా సేవలందించిన శివన్‌ గతవారం రిటైర్ అయ్యారు. అయితే పోస్ట్‌మాన్‌గా శివన్ అంకితభావం గురించి తెలుసుకున్న ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ఈ విషయాన్ని బుధవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అంకిత భావంతో తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన శివన్‌ను ప్రశసింస్తూ ఐఏస్‌ అధికారి సుప్రియా సాహు చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.
నిబంద్ధతతో, అంకిత భావంతో పనిచేసిన శివన్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తూ పదవి విరమణ శుభకాంక్షలు తెలుపుతున్నారు. అతడు నిజమైన హీరో అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. దేశ నిర్మాణంలో అతని పాత్ర చాలా ప్రశంసించబడింది. అతని నిబద్ధతకు అభినందనలు. అతను పద్మ పురస్కారానికి అర్హుడు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. శివన్ ఇకపై ఆనందకర జీవితాన్ని గడపాలని వారు ఆకాంక్షించారు.

Telugu Moral story about hunter - a moral story telugu

సంతృప్తి : ఒక మంచి కథ 

ఒక వేటగాడు అవసరానికి తన గుర్రాన్ని అమ్మడానికి సంతకు వెళ్ళాడు.

గుర్రానికి సరైన బేరం కుదరక గుర్రానిచ్చి ఆవుకు మారకం వేశాడు. మరొకరి సలహా తీసుకుని ఆవునిచ్చి గాడిదకు మారకం వేశాడు. గాడిదనిచ్చి బూట్లు తీసుకొన్నాడు. చివరకు బూట్లిచ్చి ఒక టోపి తీసుకున్నాడు.

ఆ టోపితో ఇంటికి వస్తూ దారిలో వంతెన మీద నడుస్తుంటే రాయి తగిలి బోర్లాపడ్డాడు. టోపి కాస్తా నదిలో పడింది. దిగులుగా అటే చూస్తూ కూర్చున్నాడు.అదే దారిలో వచ్చే ఇద్దరు బాటసారులు విషయం అడిగి తెలుసుకున్నారు. అయ్యో పాపం అని బాధపడ్డారు. "నీకివాల ఉపవాసమే" అన్నాడొకడు. పెళ్ళాంతో బడితపూజ తప్పదన్నాడింకోకడు. "నా పెళ్ళాం అలాంటిది కాదు, ఏమీ అనదు "అని వేటగాడు బాటసారులతో పందెం కట్టాడు.

బాటసారులిరువురు వేటగాడింటికి వెళ్ళారు. వేటగాడు గుమ్మంలో నుంచి భార్యను పిలిచాడు. వాడి పెళ్ళాం ఎదురుగా వచ్చి మావా! వచ్చినావా అంది ఆప్యాయంగా.వాడు జరిగింది చెప్పడం మొదలు పెట్టాడు.

వేటగాడు : "గుర్రం ధరకు పలకకపోతే ఆవుకి మారకం వేశా "అన్నాడు.
భార్య : "మంచి పని చేశావు మావా పాలు తాగవచ్చు"
వేటగాడు : "ఆవును కూడా గాడిదకు మారకం వేశా"
భార్య : "కట్టెలు అడివినుంచి మోసుకు వస్తుందిలే" అంది తృప్తిగా.
వేటగాడు : "గాడిదను అమ్మేసి చెప్పులు తీసుకొన్నా"
భార్య : "అడవుల్లో రాళ్లు, రప్పలు తగలకుండా ఉంటుందిలే మావా"
వేటగాడు : "అవి కూడా ఉంచుకో లేక టోపీకి మారకం వేసినా"
భార్య : "సరేలే మావా ఆ టోపితో అందంగా ఉంటావు"
వేటగాడు : "కానీ వస్తావుంటే నేను వంతెన మీద పడితే టోపి జారి నీళ్లలో పడ్డది"
భార్య : "పోతే పోయిందిలే మావా! నీవు పడిపోకుండా వున్నావు, అంతా అడవి తల్లి దయ" అని తృప్తిగా ముద్దు పెట్టుకుంది.
గుర్రాన్ని నష్టపోయి వచ్చినందుకు భర్తను విమర్శించకుండా, ఎత్తిపొడుపు మాటలు అనకుండా, భర్త క్షేమంగా ఇంటికి వచ్చినందుకు అడవి తల్లికి కృతజ్ఞతలు తెలుపుకుంది.
ఎగతాళి చేద్దామనుకున్న బాటసారులు ఆ వేటగాడి భార్య మంచి మనసుకు సిగ్గుతో తలదించుకుని వెళ్ళిపోయారు.
* * * * * * * * * * * * * * * * *
మానవుని యొక్క అన్ని బంధాలు వ్యాపార సంబంధాలుగా పరిణమిస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి సంభాషణ వినగలమా!
కరుగుతున్న క్షణానికి, జరుగుతున్న కాలానికి, అంతరించే వయసుకి చివరకు మరపురాని జ్ఞాపకాలుగా మిగిలేవి జీవితంలో జరిగే కొన్ని మంచి సందర్భాలే.
అందుకే, ఏ ఒక్కరిని తొందరపడి ఏం అనకండి. కన్ను చెదిరితే, గురి మాత్రమే తప్పుతుంది. మనస్సు చెదిరితే జీవితమే దారి తప్పు తుంది. ఎగతాళి చేసేవారికి కాలమే సమాధానం చెబుతుంది.

Thursday, July 16, 2020

A successful story about a daily labour man.

మన దగ్గిర ఇలా సిగ్గు పడే వాళ్ళు వున్నారా ?

🏵️ఆ కలెక్టరమ్మ ఎందుకు సిగ్గుపడింది..? ఏమిటీ ఆ వింత కథ..?


🏵️ఆమె…. డాక్టర్ బృంద ఐఏఎస్… కాంధమాల్ అనే జిల్లాకు కలెక్టర్ ఆమె…! కాస్తోకూస్తో జనం కోణంలో… ఏదైనా మంచి చేయాలనుకునే కలెక్టర్…! అదసలే ఒడిశా… బీమారు రాష్ట్రాల్లో ఒకటి… అంతులేని పేదరికం, జాడతెలియని అభివృద్ధి… అనేకానేక గ్రామాలకు రోడ్లుండవు, చదువు అసలే ఉండదు, వైద్యం అందదు… ఆమె ఓరోజు పత్రికలు చదువుతుంటే ఆమెను ఓ వార్త ఆకర్షించింది…

🏵️ అది సంపూర్ణంగా చదివింది… వివరాలు తెప్పించుకున్నది… ఓ కలెక్టర్‌గా సిగ్గుపడింది… ఈ వ్యవస్థకు ఏమీ చేయలేకపోతున్నాను సుమా అని తలవంచుకున్నది… డ్రైవర్‌ను పిలిచింది, గుమ్సాహి అనే ఊరి దగ్గరకు తీసుకువెళ్లాలని చెప్పింది… డ్రైవర్ పరేషాన్… ఆమె బయల్దేరింది…

🏵️ ఆ ఊరు చేరుకున్నది… ఇక్కడ జలంధర్ నాయక్ అంటే ఎవరు అని అడిగింది…. ఏమిటీ కథ నేపథ్యం..?ఆయన ఓ మట్టిమనిషి… వయసు 45… పుల్బనీ తాలూకాలోని గుమ్సాహి తన సొంతూరు… ఒంటిచేత్తో కొండను తొలిచి తమ ఊరికి రోడ్డు వేసిన బీహారీ దశరథ్ మాంఝీ కథ తెలుసు కదా… సేమ్, ఆయన ఒడిశా మాంఝీ… ఎందుకో తెలుసా..? తనూ అంతే… ఆ ఊరికి రోడ్డు లేదు, నిజం చెప్పాలా..? కరెంటు కూడా లేదు, మంచినీటి సరఫరా ఆశించేదే లేదు…

 🏵️ఒక్కొక్కరే ఊరు విడిచి వెళ్లిపోయారు… ఆ స్థితిలో ఆ ఊరికి రోడ్డు తనే సొంతంగా వేయాలని నిర్ణయం తీసుకున్నాడు ఈ జలంధర్… ఎందుకు..? తన ఊరి నుంచి పుల్బనీలోని పాఠశాలకు పిల్లలు వెళ్లాలన్నా అవస్థలే… ఎవరిని ఎన్నేళ్లు వేడుకున్నా ఫలితం లేదాయె… లంచాలు తప్ప ఇంకేమీ తెలియని అధికారులకు అస్సలు పట్టదాయె… అసలు ఈ దేశానికి పట్టిన దరిద్రమే ఈ నాయకులు, ఈ అధికారులు అని అర్థమైంది… దాంతో ఓ ఆలోచనకు వచ్చాడు… కనీసం తన ఊరికి రోడ్డు వేసుకోలేనా…?భార్య సద్దిమూట కట్టి ఇచ్చింది… ఓ పలుగూ, ఓ పార పట్టుకుని బయల్దేరాడు… రోజూ పొద్దున మొదలు పెట్టి సాయంత్రం దాకా తనే రోడ్డు వేయడం మొదలు పెట్టాడు…

🏵️రాళ్లూరప్పల్ని తొలగిస్తూ, రోడ్డు వేసుకుంటే పోతున్నాడు… మొత్తం 15 కిలోమీటర్ల రోడ్డు తన టార్గెట్… ఒక్కడూ సహకరించినవాడు లేడు… అయితేనేం..? ఆ గడ్డపార ఆగలేదు, ఆ పార అలిసిపోలేదు… రెండేళ్లు… నమ్మండి… రెండేళ్లపాటు కష్టపడ్డాడు… 

🏵️నా జీవిత లక్ష్యం అదే అని తీర్మానించుకుని అదే పనిలో మునిగిపోయాడు… 8 కిలోమీటర్ల రోడ్డు తనొక్కడే నిర్మించాడు… ఓరోజు ‘గుండెలో తడి’ ఇంకా మిగిలిన ఓ స్థానిక పత్రిక జర్నలిస్టు ఆ కథను రాశాడు… అదీ ఆ కలెక్టర్ దగ్గరకు చేరింది… ఆమె చదివింది… ఆమె కళ్లు చెమర్చాయి…

 🏵️ఈ వ్యవస్థలో భాగమైన తను కూడా సిగ్గుపడాలి కదానే భావన ఆమెను తలవంచుకునేలా చేసింది… అందుకే ఆ ఊరికి బయల్దేరింది…అతన్ని కలిసింది… మాట్లాడింది… ‘ఏం లేదు మేడమ్… మూడేళ్లు ఆగండి, నేనా రోడ్డును పూర్తి చేస్తాను’ అన్నాడు జలంధర్… ఆమె మరింత సిగ్గుపడింది… ఓసారి రోడ్డు చూద్దామంటూ వెళ్లింది…

🏵️ఒక మనిషి శ్రమను, లక్ష్యాన్ని, నిబద్ధతను, కష్టాన్ని, సంకల్పాన్ని చూసింది… ఆమెలో కలెక్టర్ అనే పాత్ర నిద్రలేచింది… అయ్యా, మీ త్యాగం నిరుపమానం అని ఆయన చేతులు పట్టుకున్నది… మిగతా ఆ ఏడు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం ఇక నాకు వదిలెయ్ అని చెప్పింది… తనకు అందుబాటులో ఉన్న ఏవో నిధులను అడ్జస్ట్ చేసింది… ఆ రోడ్డు పూర్తయ్యేదాకా దాని నిర్మాణ పర్యవేక్షణకూ తననే నియమించింది… అంతేకాదు, ఇప్పుడా ఊరికి కరెంటు పోల్స్, లైన్స్ పడుతున్నాయి… మంచినీటి సరఫరా ప్రణాళికా రూపుదిద్దుకున్నది…

 🏵️మరో విషయం… ఈ రెండేళ్లపాటు తను చేసిన పనికి ఉపాధిహామీ కింద డబ్బులు ఇవ్వటానికి కూడా ఆమె అంగీకరించింది… వావ్… ఇవీ కదా సక్సెస్ స్టోరీలు… ఇవీ కదా పది మందికీ స్పూర్తినిచ్చే అసలు విజయగాథలు…!!