శ్రావణి పుట్టింటికెళ్లి సంవత్సరం కావొస్తుంది. తండ్రి పోయాకా...మళ్ళీ ఆ ఇంటి గడప తొక్కనేలేదు. మూడేళ్ళ క్రితం తల్లి చనిపోవడంతో...పుట్టింట్లో తనకున్న చనువు తగ్గిపోయినట్లు అయింది.తన తండ్రి వున్నా కుశల ప్రశ్నలు వరకూ అడిగి మాట్లాడగలరు గానీ...కూతురు అచ్చటా ముచ్చటా చూడగలిగేదీ...కష్టం,సుఖం తీర్చగలిగేది తల్లి మాత్రమే.అలాంటి తల్లి దూరమైనప్పుడు పుట్టింటి ప్రతి ఆడపడుచూ అణిగి మణిగి ఉండాల్సిందే....!
శ్రావణికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అన్నయ్య,వదినా ఉద్యోగస్తులు కావడంతో...వారు తన తండ్రికి భోజనసౌకర్యాలు అమర్చిపెట్టినా...ఇంకా ఆయనకు చక్కబెట్టాల్సిన పనులను మాత్రం పెద్దగా పట్టించుకునేవారు కాదు.అయినా..ఆయనెప్పుడూ ఎవరిచేతా ఏ పనీ చేయించుకోలేదు. పని అలవాటు లేకపోయినా అవసరం అలవాటు పడేలా చేస్తుంది.భార్య లేకపోయినా.. తన పనులు తాను కానిచ్చుకుని...తన తండ్రి జ్ఞాపకార్ధం గా ఉంచుకున్న చెక్క వాలు కుర్చీలో అలసటగా నడుం వాల్చి సేదతీరేవారు.భార్య మరణిస్తే..భర్తకొచ్చే కష్టాన్ని కళ్లారా చూసింది శ్రావణి. అన్నయ్యా,వదినా తన తండ్రిని సరిగా పట్టించు కోవడం లేదనే బాధతో ... అదే విషయాన్ని అన్నయ్యని నిలదీసి అడిగింది.పుట్టింటి గడప దాటి వెళ్లిన ప్రతి ఆడపిల్లా... మరీ అంత జోక్యం చేసుకోడం మంచిది కాదేమో...?దానితో ఆ అన్నాచెల్లెళ్ల మధ్య మనస్పర్థలు వచ్చాయి. "నీవేమైనా ఆయన్ని నెత్తిన పెట్టుకొని చూసుకుంటావేమో తీసుకెళ్లి చూసుకో" అంటూ కోపంతో పెద్దపెద్ద కేకలేశాడు. తండ్రి ఆ గొడవంతా విని..."నీకు నామీదున్న ప్రేమతో నీకలా అనిపిస్తుంది గానీ...మీ అన్నయ్యా వదినా నన్ను బానే చూసుకుంటున్నారమ్మా" అని కొడుకునీ,కోడలనీ వెనకేసుకొచ్చారు. అన్నయ్య తిట్టినందుకు బాధ పడలేదు శ్రావణి .తన తండ్రి మధనం లో ...వారెలా చూసినా కడవరకూ వాళ్ళే కదా నాకు దిక్కు అన్నట్టుగా అనిపించి ..మనసంతా బరువుగా అయిపోయింది శ్రావణికి. అన్నయ్య కోరిక మేరకు తండ్రిని తన ఇంటికి తీసుకుపోయి ప్రేమగా చూసుకోవాలని మనసారా వున్నా...తండ్రి కప్పిపుచ్చిన తన పుట్టింటి పరువుని అత్తింట్లో చులకన చేయాలనుకోలేదు. ఎవరినీ బాధ పెట్టడం ఇష్టం లేకనో ఏమో...ఆ వాదన జరిగిన నెల్లాళ్లకే...తండ్రి చనిపోయారు.ఆయన కర్మకాండలు అవ్వనిచ్చి తన ఇంటికి ప్రయాణమై వెళ్తూ...ఇంక నాకూ ఆఇంటికీ బంధం తీరిపోయింది అనుకుంది శ్రావణి.
ఆ తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు అన్నయ్య నుంచి ఫోన్ వచ్చింది శ్రావణికి. "పదిరోజుల్లో నాన్న సంవత్సరీకం వస్తుంది. నువ్వూ,బావగారూ తప్పకుండా రావాలి "అంటూ. తల్లీ తండ్రీ లేని పుట్టిల్లు ఇక మనది కాదనుకున్న ప్రతిఆడపిల్లా ...కాకితో కబురొచ్చినా...అన్నీ మర్చిపోయి
పరుగెత్తుకుని వెళ్లిపోవాలనుకుంటుంది.
గతం గతః– అనుకుంది శ్రావణి. అన్నయ్యా వదినతో పూర్వం లా కలిసిపోవానుకుని....భర్తతో కలిసి పుట్టింటికి వెళ్ళడానికి ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంది.
తనపుట్టిల్లు కళ్ళముందు మెదులుతుంటే...
ఎంతో గర్వంగా అనిపించింది.అమ్మా , నాన్నా కలల ప్రతిరూపమైన ఆ ఇంటి డాబా మీదకు ఎగబాకిన బొగనవిలియా కొమ్మలు గుత్తు గుత్తులుగా వున్న పూలతో గమ్మత్తుగా గాలికి ఊగుతుంటే...చూడటానికి ఎంత ఇష్టంగా ఉండేదో...! పోర్టికోలో పచ్చ సంపెంగలైతే సువాసనతో దారిన పోయేవాళ్ళ ముక్కుపుటాలను అదరకొట్టేవి. ఆఇంటి పెరట్లో....ఉసిరి,మామిడి,జామ,
సపోటా, అరటి ఇంకా చాలా చాలా పళ్ల చెట్లతో కళకళ లాడే పచ్చతోరణాల్లా వుండేవంటే ...అదంతా తన తండ్రి అభిరుచే. ఆ చెట్ల నుంచి రాలే ఆకుల్నీ,పూలనీ పొడవాటి కొబ్బరి చీపురు తో రెండు పూటలూ అమ్మ తుడుస్తూ ఉంటే....ఆ సేవకు భూదేవి తన తల్లికెన్ని దీవెనలు ఇచ్చిఉంటుందో..? అమ్మ తెల్లవారుజామునే లేచి వాకిట్లో ముగ్గువేసేది ఏమో...లక్ష్మీదేవికి నివాసంలా అనిపించేది.
అలాంటి పుట్టింటిని శ్రావణి ఎలా మర్చిపోగలదు? ఆ ఇంటికోసం తన తల్లీతండ్రీ పడిన శ్రమ గుర్తుకొస్తుంటే...ఆ ఇంటినెప్పుడెప్పుడు చూసుకుందామా అన్న తపన ఎక్కువైపోయింది శ్రావణి కి. అమ్మా , నాన్నా వాడిన వస్తువులను తనివితీరా చూసుకోవాలనీ... ఎప్పుడో అమ్మ పట్టుకెళ్లమని చెప్పిన అటక మీద ఇత్తడిసామానుతోపాటూ...వీలైతే నాన్న జ్ఞాపకార్థంగా ఆయన వాడిన చెక్క వాలుకుర్చీని తెచ్చుకోవాలి–మనసులో అనుకుంది శ్రావణి.
ఎంతో అభిమానంతో పుట్టింటికి వెళ్లినశ్రావణి కి ...వెళ్ళగానే ఆఇంటి అరుగు మీద నాన్న కూర్చునే వాలుకుర్చీ కనిపించలేదు.కనిపిస్తే.. తన తండ్రి పలకరించినట్లుగా ఫీలయ్యేదేమో...?ఆ అరుగంతా బోసిపోయినట్లు వుంది. పెరట్లోచెట్లూ, వీధిలో బొగనవిలియా అన్నీ కూడా తలల వరకు నరికేసి వున్నాయి.ఆ ఇంటి పచ్చదనం అంతా హరించుకుపోయింది. అదేమిటి అలా ఎందుకు చేశారని అడిగితే....ఆ చెట్ల ఆకులూ, పూలు తుడవాలంటే...ఆ ఇంట్లో పనిచేయడానికి ఎవరూ రామంటున్నారనీ,అందుకే ఎందుకొచ్చిన గొడవని కొమ్మలన్నీ కొట్టించేసామనీ ఎంతో రిలీఫ్ గా మాట్లాడారు. ఆ సమాధానం విని...తల తిరిగినట్లైంది శ్రావణి కి.ఆ ఇంటికి కళా కాంతీ లేకుండా చేసిన వారి మీద చెర్రెత్తికొచ్చినా.. తమాయించుకుంది. మనసులోనే భారంగా నిట్టూర్చి ...ముఖంపై రాని చిరునవ్వుని పులుముకుని...ఇంట్లోకి నడిచింది. ప్రయాణిక బడలిక వల్లనేమో కాసేపు అమ్మా నాన్నా వాడిన పందిరిమంచంపై పడుకుని..వారి ఒడిలో పడుకుని జోల పాడించుకున్నట్టుగా అనుభూతి చెందాలనుకుంది. అటకపైకి తొంగి చూసి అమ్మ ఇస్తానన్న ఇత్తడి సామాన్ని కిందకి తీయాలనుకుంది. నాన్న వాలుకుర్చీని ప్రేమగా తడమాలనుకుంది. ఊహూ... ఇవేమీ ఆ ఇంట్లో కనిపించలేదు.ఇల్లంతా కొత్త ఫర్నీచర్తో నిండిపోయి వుంది. అవేమీ కళ్ళకింపుగా అనిపించలేదు శ్రావణికి.
మర్నాడు...తనతండ్రికి జరపాల్సిన పిండ ప్రధాన కార్యక్రమాలన్నీ ఘనంగానే జరిపించారు. బంధుమిత్రుల రాకతో...వారి పలకరింపుతో శ్రావణి మనసుకి కాస్త ఊరాట కలిగింది.
ఆ సాయంత్రం ఊరు బయలుదేరుతూ ....తాను దొంగాటలు, కోతి కొమ్మచ్చెలు ఆడుకున్న దొడ్డినంతా కలియచూద్దామని వెళ్లిన శ్రావణి కి –ఇంటి వెనుక భాగంలో పాడుబడ్డ సామాను వుండే రేకుల షెడ్డు లో పడేసి కనిపించాయి...ఆ పందిరి మంచం,చెక్క వాలు కుర్చీ.వాటిని చూడగానే .. శ్రావణి కళ్ళు తడిబారకుండా వుండలేకపోయాయి.ఇత్తడి సామాల్ని కూడా ఏ షావుకారుకో భేరం పెట్టేసి ఉంటారని అర్థం అయింది.మరేమీ మాట్లాడకుండా...తన ఇంటికి ప్రయాణమై వచ్చేసింది భారమైన మనసుతో.
శ్రావణి లో ఏం జ్ఞానోదయం అయిందో ఏమో....తను నోచుకోని అదృష్టాన్ని కనీసం తన భర్త కళ్ళల్లోనైనా కనిపించాలనుకుంది. ఇంటికి వస్తూనే.. అటకమీదకెక్కించిన అత్తగారి వయోలిన్,బోశానం పెట్టె, మావగారి చెక్క బట్టల స్టాండ్లను కిందకి తీయించి...మ్యూజియం లో వస్తువుల్లా ..వాటికి పూర్వపు కళ వచ్చేలా శోభామయంగా తీర్చిదిద్దింది.
ఇంట్లో పెద్దవాళ్ళు కనుమరుగైనా... వాళ్ళు వాడిన వస్తువుల్లో వారి ప్రతిబింబాలు ఎప్పుడూ కనిపిస్తూనే వుంటాయని తెలిసొచ్చింది పుట్టింటికెళ్లివచ్చిన శ్రావణికి.
చనిపోయిన తనతల్లిదండ్రులకు ఈ విధంగా కూడా తన భార్య విలువ ఇస్తున్న ఆమె అంతరంగాన్ని ముచ్చటగా చూసాడు ఆమె భర్త.
No comments:
Post a Comment
Thanks for visiting this site ....